దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. కరోనా వైరస్ బారిన పడిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆరోగ్యం విషమించడంతో డూస్ ఆసుపత్రికి తరలించారు.
కరోనా సోకిన ఆయన ప్రస్తుతం జ్వరం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. డూన్ ఆసుపత్రి వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. ముఖ్యమంత్రి రావత్, అతని భార్య, కుమార్తెలకు డిసెంబరు 18న కరోనా లక్షణాలు కనిపించాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా తెలియజేశారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే సీఎం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఆయనకు జ్వరం రావడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై వైద్యుల రిపోర్టు రావాల్సి ఉంది.
ఇదిలావుండగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగున్న దృష్ట్యా ప్రభుత్వం కరోనా గైడ్లైన్స్ కఠినంగా అమలు చేసే పనిలో పడింది. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించాలని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అని ప్రచారం చేస్తోంది. వేడుకలు జరుగుతున్న ప్రాంతాల్లో కరోనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రే కరోనా బారిన పడటంతో ప్రజలు, ఆయన అభిమానులు ఆందోళనలో పడ్డారు.