భారత్ విషయంలో జోక్యం చేసుకున్నందుకు కెనడాకు శివసేన కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో జోక్యం చేసుకోవడంపై శివసేన తీవ్రంగా ధ్వజమెత్తింది. ఈ సమస్య భారత్ అంతర్గత వ్యవహారమని శివసేన తేల్చి చెప్పింది.
శివసేన నేత ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ డియర్ జస్టిన్, మీరు స్పందించారు సరే… కానీ.. ఇది భారత దేశ అంతర్గత వ్యవహారం. ఇది ఇతర దేశాల రాజకీయాలకు మేతగా మారకూడదు. ఇతర దేశాల పట్ల భారత దేశం చూపించే మర్యాదను మీరు దృష్టిలో ఉంచుకోండి. కెనడా లాగా ఇతర దేశాలూ కామెంట్స్ చేయకముందే ప్రధాని మోదీ ఈ సమస్యను పరిష్కరించాలని అభ్యర్థిస్తున్నా అన్నారు.
ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. భారత్లో రైతుల నిరసనలకు సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి చింతిస్తున్నామన్నారు. అయితే మీకో విషయం చెప్పదలుకున్నా.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు కెనడా ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందన్నారు. సమస్యల పరిష్కారంలో చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే వివిధ మార్గాల ద్వారా భారత అధికారులను సంప్రదించామని తెలిపారు. మనందరం.. ఒక్కతాటిపైకి వచ్చి సమస్యను పరిష్కరించేందుకు అనువైన సమయం ఇదే అన్నారు. ఈ మేరకు జస్టిన్ ట్రూడో ఓ వీడియో పోస్ట్ చేశారు. భారత రైతులు చేపడుతున్న నిరసనలపై స్పందించిన తొలి విదేశీ నేత ట్రూడోనే కావడం గమనార్హం.