దేశంలో రోడ్లపై బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ నేతలే తిరగాలా అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లోని హథ్రస్ ఘటనలో మృతిచెందిన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాహుల్ హథ్రస్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేశారు. సెక్షన్ 188 కింద అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు అరెస్టు చేయడంపై రాహుల్ ఫైర్ అయ్యారు. పోలీసులు తనపై లాఠీ చార్జ్ చేశారని రాహుల్ అన్నారు. దేశంలో నడిచే అవకాశం బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ నేతలకు మాత్రమే ఉందా అని ప్రశ్నించారు. పోలీసులు ఎంత చెప్పినా రాహుల్ వినకుండా తానొక్కడినే నడుచుకుంటూ ముందుకు వెళతానని వెళ్లడంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారింది.
హథ్రస్లో 19 ఏళ్ల యువతి గడ్డి మేత కోసం వెళ్లగా దుండగులు ఆమెపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె రెండు రోజుల క్రితం చనిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ కేసు దుమారం రేపుతోంది. యువతి కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహావేశాలతో రగిలి పోతున్నారు. తమకు తెలియకుండా అర్దరాత్రి అంత్యక్రియలు చేశారని పోలీసులపై మండిపడుతున్నారు. ఇప్పుడు రాహుల్ పర్యటనతో పరిస్థితులు ఇంకా వేడెక్కే అవకాశం ఉంది. ఘటనపై ప్రధాని మోదీ సైతం స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.