ఉత్తరప్రదేశ్లో అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఆమె మృతదేహానికి జరిగిన అంత్యక్రియలపై అనుమానాలు వస్తున్నాయి. పోలీసులు వ్యవహరించిన తీరు సరైన విధంగా లేదని ఆమె కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
హాథ్రస్లో పశువుల మేత కోసం వెళ్లిన ఓ 19 ఏళ్ల యువతిపై నలుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడి.. తిరగబడిన ఆమెను చున్నీతో గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఈ నెల 19వ తేదీన చోటుచేసుకుంది. బాదితురాలు ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
ఢిల్లీలోని హాస్పిటల్లో చనిపోయిన ఈమె మృతదేహాన్ని పోలీసులే అంత్యక్రియలు చేసేందుకు తరలించారని.. ఇందుకు కుటుంబ సభ్యులను కూడా అనుమతించలేదన్న ఆరోపణలు బయటకు రావడంతో ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఇంటికి వెళ్లి అంత్యక్రియలు చేస్తామని.. రాత్రి పూట అంత్యక్రియలు చేసే సాంప్రదాయం మాకు లేదని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా పోలీసులు వినలేదని తెలుస్తోంది. అయితే దీన్ని జిల్లా కోర్టు ఖండించింది.
అంత్యక్రియల సమయంలో బాదితురాలి కుటుంబ సభ్యులంతా అక్కడే ఉన్నారని.. తమ వద్ద వీడియోలు ఉన్నాయని జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమతి తీసుకొనే అంత్యక్రియలు చేశామన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సీఎం యోగితో మాట్లాడారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.