దేశంలో కరోనా విశ్వరూపం కొనసాగుతూనే ఉంది. తాజాగా కరోనాతో మరో ఎంపీ మృతి చెందారు. కర్నాటకకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ చనిపోయారు. కరోనా రావడంతో ఆయన ఈనెల 2వ తేదీ నుంచి బెంగుళూరులోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నేడు తుదిశ్వాస విడిచారు.
నిన్న ఏపీలోని తిరుపతి ఎంపి బల్లి దుర్గా ప్రసాద్ కూడా చనిపోయారు. ఈయన కూడా కరోనా సోకడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో మృత్యువాత పడ్డారు. అంతకుముందు తమిళనాడులోని కన్యాకుమారి లోక్సభ ఎంపీ వసంత కుమార్ కూడా కరోనాతో చనిపోయారు.
నేడు మరో ఎంపీ చనిపోవడంతో పార్లమెంటులో విషాధ ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. అశోక్ గస్తీ మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. నిబద్దత కలిగిన నేత అని గుర్తు చేసుకున్నారు. ఈయన మృతిపట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం తెలుపుతున్నారు. ఈ ఏడాది జులై 22న ఈయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీ మృతిపట్ల పార్టీ నేతలతో పాటు ఆయన అభిమానులు సైతం తీవ్ర విషాదంలో పడిపోయారు.