భారత్పై దాడులు చేసేందుకు పాకిస్థాన్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఏ చిన్న అవకాశం దొరికినా ఇండియాను దెబ్టకొట్టాలని చూస్తుంటుంది. తాజాగా సరిహద్దులో లభ్యమైన ఆయుధాలను చూస్తుంటే భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.
పంజాబ్లో భారత్ పాక్ సరిహద్దులో ఆయుధాలను సైన్యం గుర్తించింది. ఫిరోజ్పుర్ జిల్లాలో బీఎస్ఎఫ్ దళాలు తనిఖీలు చేస్తుండగా ఓ పొలంలో బ్యాగు లభ్యమైంది. ఇందులో ఆయుధాలు ఉన్నట్లు భారత దళాలు గుర్తించాయి. ఫిరోజ్పుర్ జిల్లాలోని ఆటోహార్ ద్వారా పాకిస్థాన్ నుంచి మనదేశంలోకి వివిధ మార్గాల ద్వారా ఆయుధాలను సరఫరా చేస్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఆయుధాలు దొరికాయి.
ఆరు మ్యాగజైన్లతో 3 ఏకే 47 రైఫిల్స్, 91 రౌండ్లు, 4 మ్యాగజైన్లతో రెండు ఎం 16 రైఫిల్స్, నాలుగు మ్యాగజైన్లతో కూడిన రెండు పిస్టల్స్, 20 రౌండ్లు తదితర ఆయుధాలు బ్యాగులో దొరికాయి. భద్రతా దళాలు వీటిని స్వాధీనం చేసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గత మూడు రోజులుగా జమ్మూ-కశ్మీర్లోని సరిహద్దులో పాకిస్థాన్ కాల్పులు జరుపుతోంది. భారత్ కూడా సమయం చూసి ఎదురు దాడి చేస్తోంది. మొత్తానికి సరిహద్దులో ఓ వైపు చైనా, మరోవైపు పాకిస్థాన్లు భారత్పై దాడులు చేసేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా వదిలేలా కనిపించడం లేదు.