శ్రీశైలం జలాశయంలోకి నీరు ఎక్కువవుతోంది. దీంతో అధికారులు దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో రేపు సీఎం జగన్ శ్రీశైలం జలాశయానికి వస్తారని తెలుస్తోంది.
ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మొత్తం 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిన్న మూడు గేట్లను అధికారులు తెరిచారు. ఇన్ఫ్లో ఎక్కువ అవ్వడంతో ఇప్పుడు 8 గేట్ల ద్వారా నీరు విడుదల చేస్తున్నారు.
జలాశయానికి ప్రస్తుతం 4 లక్షల 12 వేల 589 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 2 లక్షల 90 వేల 953 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.90 అడుగుల మేర నీటి మట్టం ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 208.7210 టీఎంసీల నీరు ఉంది.
కృష్ణా పరివాహక ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. రేపు నాగార్జున సాగర్ గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. కాగా సీఎం జగన్ శ్రీశైలంలో పర్యటిస్తారని తెలుస్తోంది. వెలుగొండ హెడ్ రెగ్యులేటర్ పనులను ఆయనకు అధికారులు వివరించే అవకాశం ఉంది.