మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పుపై మళ్లీ జోరుగా వార్తలు బయటకొస్తున్నాయి. గతంలో ఆయనపై పలుమార్లు పార్టీ మారతారని పుకార్లు వచ్చినా ఆయన పార్టీ మారలేదు. మళ్లీ నేడు ఆ తరహాలోనే పుకార్లు పుట్టుకొస్తున్నాయి.
2019లో వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో జాయిన్ అవుతారని పలుమార్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయాన్ని ఆయన కూడా కొట్టిపారేశారు. ఇక వైసీపీ నేతలు కూడా దీన్ని దృవీకరించలేదు. అయితే ఈ సారి మాత్రం విషయం సీరియస్గానే కనిపిస్తోంది. గంటా ఈ సారి కచ్చితంగా పార్టీ మారతారని చెబుతున్నారు.
ఈ మేరకు ఇప్పటికే ఆ పార్టీ అదిష్టానంతో ఆయన టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వై.ఎస్ జగన్ కూడా గంటా చేరికకు లైన్ క్లియర్ చేశారని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే గతంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ గంటాను పార్టీలోకి తీసుకునే ఉద్దేశం తమకు లేదని చెప్పిన విషయం తెలిసిందే. అయితే గంటా మాత్రం వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ తతంగం ముగిసిపోనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి గంటా వ్యవహారంపై జరుగుతున్న చర్చల్లో వాస్తవమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..