కాళేశ్వరం అద్భుతఘట్టం డిస్కవరీ ఛానల్లో డాక్యుమెంటరీగా రాబోతుంది..!

Discovery Documentary on Kaleshwaram on June 25

కాళేశ్వరం… తెలంగాణ మణిహారం. ఈ ప్రాజెక్ట్ తో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా గో‘దారి’నే మళ్లించింది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతమని చెప్పొచ్చు. తెలంగాణకు కీర్తి కిరీటంగా నిలిచిన ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీ రూపంలో జూన్ 25న రాత్రి 8గంటలకు మన ముందుకు తీసుకొస్తుంది. ఇది సీఎం కేసీఆర్.. ఇంజనీరింగ్ నిపుణుల కృషికి.. యావత్ తెలంగాణ సమాజానికి గర్వకారణంగా నిలువనుంది. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ తన మానస పుత్రికగా భావించి దగ్గరుండి మరీ పూర్తి చేయించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ వ్యవస్థ కలిగిన మేఘా లాంటి సంస్థలను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యం చేశారు.

కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స అంతర్జాతీయ స్థాయిలో డాక్యుమెంటరీ చిత్రాలు నిర్మించడంలో ఎంతో ప్రఖ్యాతి పొందినవారు. సమాజానికి విజ్ఞాన సమాచారం అందించే చిత్రాలు సైన్స్ & టెక్నాలజీ, ఆర్ట్ & కల్చర్ వంటి వాటిలో ఎన్నో అద్భుత చిత్రాలు నిర్మించారు. ఆయన మన తెలుగు వారు అందులోనూ హైదరాబాద్ కు చెందిన వారని చాలా మందికి తెలీదు. గత మూడు దశాబ్దాలుగా దేశ రాజధాని ఢిల్లీలో స్థిరపడిన ఆయనకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. తెలంగాణ మణిహారం కాళేశ్వరంపై ఆయన దాదాపు మూడు సంవత్సరాలు పరిశోధించి Lifting A River, అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “దక్షిణ భారతదేశంలో గోదావరి అతి పెద్ద నది. సాగు, తాగునీటికి, మరెన్నో అవసరాలకు దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలోని 13 జిల్లాల్లో వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో గోదావరి ప్రవహిస్తుంది. కానీ తెలంగాణలో భూములకు నీరందడం లేదు. ఈ విషయాన్ని దృష్టి లో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. ఇంతటి బృహత్తర ప్రాజెక్ట్ ను తెలంగాణ ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా, రికార్డ్ సమయంలో పూర్తి చేసిందో ఈ డాక్యుమెంటరీలో చూపించాము. ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే భారీ నిర్మాణం, అద్భుతమైన యంత్రాలలతో పాటు అత్యాధునికి సాంకేతిక పరిజ్ణానంతో నిర్మించారు. అతిపెద్ద భూగర్భ పంపింగ్ హౌస్, సర్జ్ పూల్ ఈ ప్రాజెక్ట్ సొంతం. ప్రాజెక్ట్ కు ప్రాణం పోసిన వేలాది మంది కార్మికులు, ఇంజనీర్లతో పాటు తెలంగాణ ప్రజల కల సాకారం గురించి తీసినదే ఈ చిత్రం.”

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అరుదైనది. అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా విశిష్టత సంతరించుకుంది. ఇటువంటి పథకం ప్రపంచంలోనే ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు. ఈ పథకం ద్వారా ఏకంగా గోదావరి నది దారి మళ్ళించాల్సి వచ్చింది. పంపింగ్‌ ద్వారా నదిని దిగువ నుంచి ఎగువకు తరలించటం ఈ పథకంలో ప్రత్యేకత. ప్రాణహిత నది గోదావరిలో కలిసే కాళేశ్వరం ప్రాంతం నుంచి మొదలై దశల వారీగా బ్యారేజిలో నిల్వ అక్కడి నుంచి పంపింగ్‌ కేంద్రాల ద్వారా నీటిని హైదరాబాద్‌ నగర శివారు వరకూ చేర్చింది. సముద్ర మట్టానికి దాదాపు 600 మీటర్ల ఎత్తుకు తరలించే విధంగా పథకం పూర్తయ్యింది.

సీఎం కేసీఆర్ పట్టుదలతోనే కాళేశ్వరం కలల ప్రాజెక్టు సాక్ష్యత్కారమైంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎక్కడా ముంపు సమస్య, భూసేకరణ సమస్యలు రాలేదు. అంత పెద్ద గోదావరి నదినే నీటిని నిల్వ చేసి పంపింగ్‌కు జలాశయాలుగా మార్చారు. అదే సమయంలో ప్రధానంగా అందుబాటులో ఉన్న నీటి పారుదల వ్యవస్థ అంటే అప్పటికే పూర్తయిన నీళ్లులేక వెలవెలబోతున్న జలాశయాలు, కాల్వలు, చెరువులను నీటి నిల్వతో పాటు సరఫరాకు అనుసంధానం చేశారు. ఫలితంగా ఖర్చు గణనీయంగా తగ్గిపోయింది. అంత పెద్ద పథకం నిర్మించినా ప్రభుత్వానికి పెద్దగా భారం కాలేదు.

కొండపల్లి రాజేంద్ర తో పాటు ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణలో భాగంగా షూట్ టీమ్ తో సమన్వయం చేసిన జి. సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ‘కెమరామెన్ గా వివిధ తెలుగు ఛానెళ్ళకి పనిచేసిన అనుభవంతో పాటు చాలా డాక్యూమెంటరీలకి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ గా పని చేశాను. అలాగే అల్ జజీర్ లండన్ ఛానల్ , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంస్థలు, ప్రైవేట్, NGO సంస్థల కోసం గతంలో కొన్ని డాక్యూమెంటరీలు చేశాను. అదే సమయంలో రాజేంద్ర కొండపల్లి గారితో నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కోసం పని చేసే అవకాశం వచ్చింది. ఆయన దర్శకత్వంలోనే డిస్కవరీ ఛానల్ లో వస్తున్న ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించిన డాక్యుమెంటరీ లో నేను కూడా భాగమైనందుకు చాలా గర్వాంగా ఉంది. నా వృత్తిరీత్యా, ఫొటోగ్రఫీ ఫీల్డ్ లో ఉన్నందుకు, డాక్యూమెంటరీలు, యాడ్ ఫిలిమ్స్, కార్పొరేట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం ఒక ఎత్తైతే, కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టుపై తీసిన డాక్యుమెంటరీ కోసం పని చేసిన అనుభవం నాకొక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది తెలుగువారందరూ గర్వించదగ్గ సందర్భం’ అన్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చేపట్టిన నిర్మాణాలు ఎన్నో అద్భుతాలకు నిలయంగా మారింది. ఈ ఎత్తిపోత పథకంలో 15 పంపింగ్‌ కేంద్రాలు మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ నిర్మించింది. వీటిల్లో మొత్తం 104 పంపింగ్‌ మిషన్లు అంటే అన్ని యూనిట్లను అనతి కాలంలో ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటుచేసింది. ఇది అసామాన్యమైనది. సాధారణ పరిస్థితుల్లో సాధ్యం కానిది. అసాధ్యం సుసాధ్యం చేయటం ద్వారా మేఘా శక్తి సామర్థ్యాలకు అద్దం పడుతోంది. ఈ ప్రాజెక్ట్‌ ఎంత పెద్దదంటే మొత్తం 5159 మెగావాట్ల పంపింగ్‌ సామర్థ్యం కాగా అందులో ఎంఈఐఎల్‌ 4439 మెగావాట్ల పంపింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. చరిత్రలో ఎక్కడా నిర్మించలేదు.

ప్యాకేజీ 8లోని గాయత్రి భూగర్భ పంపింగ్‌ కేంద్రంలో 7 రోజుకి 2 టీఎంసీలు పంపు చేసే విధంగా 7 యూనిట్‌లు వినియోగంలోకి వచ్చాయి. ఇందులో ఒక్కొక్క యూనిట్‌ సామర్ధ్యం 139 మెగావాట్లు. ఇంత భారీస్థాయి పంపింగ్‌ కేంద్రం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్‌ వియోగించే విధంగా పంపిగ్‌ సామర్ధ్యం ఉందంటే ఎంతపెద్దదో అర్ధమవుతోంది.
మేడిగడ్డ లక్ష్మీలో 17, అన్నారం సరస్వతి 12, సుందిళ్ల పార్వతిలో 14, ప్యాకేజీ-8లోని గాయత్రి భూగర్భ పంపింగ్‌ కేంద్రంలో 7 మిషన్లు ఏర్పాటయ్యాయి. అన్నపూర్ణ కేంద్రంలో 4, రంగనాయకసాగర్‌లో 4, కొండపోచమ్మ ప్యాకేజ్‌లో భాగంగా రెండు పంప్‌హౌస్‌లైన అక్కారం లో-6, మార్కుక్‌లో-6 మిషన్‌ యూనిట్లు ఏర్పాటయ్యాయి. కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ జలాశయం నీటి నిల్వ 52 టిఎంసిలతో పెద్దది. దీనికి సంబంధించిన పంపింగ్‌ కేంద్రంలో 8, ప్యాకేజీ-21 లో భాగంగా రెండు పంప్‌హౌస్‌లలో 18 మిషన్లు, ప్యాకేజ్‌-27 లో 4, ప్యాకేజ్‌-28లో 4 మిషన్లను ఏర్పాటు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here