పోల‌వ‌రం నిర్మాణ ప‌నుల‌పై పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేసిన ప‌రిశీల‌న బృందం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ర‌దాయినిగా పిలిచే పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం 2020 నాటికి పూర్తి అవుతుంద‌ని డ్యాం డిజైన్ రివ్యూ క‌మిటీ(డిడిఆర్‌పి) చైర్మ‌న్ ఏబీ పాండ్యా తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టులోని ప‌లు విభాగాల్లో చేప‌ట్టిన ప‌నుల‌ను ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్ర‌శేఖ‌ర్ అయ్య‌ర్ ఇత‌ర స‌భ్యుల‌తో క‌లిసి పాండ్యా శుక్ర‌వారం ప‌రిశీలించారు.
పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

పోల‌వ‌రం పనుల‌పై పిపిఏ స‌భ్యులు, కేంద్ర జ‌ల‌సంఘం స‌భ్యులు, రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారుల‌తో రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ఏ.బి. పాండ్యా అధ్యక్షతన శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు.
ఈ సందర్భంగా ఏ.బి. పాండ్యా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు 48 గేట్లుకుగానూ 29 గేట్లు అమరిక పూర్తయిందని, మిగిలిన గేట్లు అమరికపై అధికారులకు పలు సూచనలు చేశామ‌న్నారు.

పోల‌వ‌రం గేట్లు ప్రపంచంలోనే అతి పెద్దవిగా పేర్కొన్నారు. పోలవరంలో 52 మీటర్ల ఎత్తున స్పిల్వే పిల్లర్ల నిర్మాణం పూర్తి అయ్యింద‌ని తెలిపారు. స్పిల్ వే బ్రిడ్జి 1128 మీటర్లుకుగానూ 1105 పూర్తి చేయడం జరిగింది. 48 గేట్లకు గానూ 29 గేట్లు బిగింపు పూర్తయింది. గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లు, పవర్ ప్యాక్ లు అమర్చే పనులు వేగంగా సాగుతున్నాయని పాండ్యా తెలిపారు.

పోల‌వ‌రం స్పిల్ వే నిర్మాణంలో కీల‌క‌మైన 192 గ‌డ్డర్లు అమరిక నేటితో పూర్తయిందని అధికారులు వివరించారు.

ప్ర‌ధానంగా అయిదు అంశాలపై సమావేశంలో చర్చించారు. వరదల‌ సమయంలో కోతకు గురైన ఎడమ గట్టు పరిరక్షణ విష‌యం కూడా చర్చకు వచ్చింది.
సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అధారిటీ సిఇఓ చంద్రశేఖర్ అయ్యార్, జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజనీర్ ఇన్ ఛీఫ్ సి. నారాయణ రెడ్డి , పోలవరం ప్రాజెక్ట్ ఎస్ ఈ నరసింహ మూర్తి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ సి హెచ్ సుబ్బయ్య, జి ఎం సతీష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here