సామాన్యులు, సెలెబ్రిటీలు అనే తేడాలేకుండా కరోనా అందరినీ వేధిస్తోంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో హాస్య నటుడు కరోనా కారణంగా కన్నుమూశారు. ‘మర్యాద రామన్న’ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించిన కోసూరి వేణుగోపాల్ కరోనా కాటుకు బలయ్యారు. గత నెలలో కరోనా బారిన పడిన వేణు గోపాల్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన వేణుగోపాల్ ఎఫ్సీఐలో మేనేజర్గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఆ తరువాత నటనపై ఆసక్తితో సినీరంగం వైపు వచ్చారు. మర్యాద రామన్న, పిల్ల జమిందారు, ఛలో, అమీతుమీ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. వేణుగోపాల్ మరణం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు.