కరాచీ బేకరి పేరు మార్చి వేరే పేరు పెట్టుకోవాలని శివసేనకు చెందిన ఓ నేత ఆ బేకరి యజమానికి బెదిరించాడు. ముంబైలోని వెస్ట్ బాంద్రాలో ఉన్న కరాచీ బేకరీకి శివసేనకు చెందిన నితిన్ నందకిశోర్ వెళ్లాడు. కరాచీ పేరు మార్చాలంటూ షాపు యజమానికి అల్టిమేటం జారీ చేశారు. మార్చిన పేరు కూడా హిందీ, ఇంగ్లీషులో కాకుండా మరాఠీలో రాయాలని సూచించారు.
దేశ విభజన తర్వాత ముంబైలో వచ్చి ఉంటున్నారని అన్నారు. ఏ మతాన్ని పాటించినా అభ్యంతరం లేదని షాపు పేరు మార్చాలని చెప్పారు. కరాచీ అనే పేరు పాకిస్తాన్ నుంచి వచ్చిందన్నారు. దీంతో తీవ్ర భయానికి లోనైన షాపు యజమాని షాపు పేరుపై కవర్ కప్పేశాడు. దీనిపై విమర్శలు రావడంతో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. ‘‘కరాచీ బేకరీలు, కరాచీ స్వీట్లు, బిస్కెట్లు సుమారు 60 ఏళ్లుగా ముంబైలో ఉంటున్నాయి. కారచీ అని ఉన్నంత మాత్రాన వారు పాకిస్తానీలు కాదు. ఇప్పుడు వారి షాపుల పేర్లు, స్వీట్ల పేర్లు మార్చాలని అడగడం పూర్తిగా అర్థం లేనిది.
పేర్లు మార్చడం శివసేన వైఖరి కాదు’’ అని ఇంగ్లీషు, మరాఠీలో సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో చూడాలి. కాగా కరాచీ బేకరీల గురించి తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రధాన నగరాల్లో కచ్చితంగా కరాచీ బేకరీలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కరాచీ బేకరీలకు సంబంధించిన వివాదం ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది.