ఆకాశ మార్గానా… అంటూ అప్పట్లో ఓ పాట మనం వినే ఉంటాం.. అలా పాటల గురించి ఇప్పుడు మనం చెప్పడం లేదు కానీ.. ఓ తల్లి తన బిడ్డకు పాలివ్వడానికి ఆకాశ మార్గమే దిక్కయ్యింది. ఇంట్రస్టింగా ఉన్న స్టోరీ ఇండియాలోనే జరిగింది.
లేహ్ నగరంలో నివాసం ఉంటున్న డోర్జి జూన్ 16న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈమె భర్త వాంగ్డూస్ బెంగళూర్లో ఉద్యోగం చేస్తుంటాడు. అయితే పుట్టిన బిడ్డకు ఆరోగ్య సమస్య కారణంగా తల్లి పాలను తీసుకోలేకపోయాడు. ఈ విషయం తెలుసుకున్న భర్త వెంటనే తన భార్య బంధువులకు విషయం చెప్పి ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం బిడ్డను తరలించారు. తాను కూడా బెంగళూరు నుంచి హుటాహుటిని ఢిల్లీ వెళ్లిపోయాడు.
అయితే ఢిల్లీలో విజయవంతంగా బాబుకు శస్త్రచికిత్స జరిగిన అనంతరం.. బాబుకు తల్లి పాలు తాగించాలని వైద్యులు చెప్పారు. అయితే అప్పటికే సిజేరియన్ చికిత్స వల్ల అనారోగ్య సమస్యతో తల్లి డోర్జి లేహ్లోని ఇంట్లోనే ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో వాంగ్డూస్ లేహ్ విమానాశ్రయంలోని తన స్నేహితుల ద్వారా అధికారులతో మాట్లడారు. వీరి ఇబ్బందులను అర్థం చేసుకున్న ఓ విమానయాన సంస్థ డోర్డి పాలను లేహ్ నుంచి ఢిల్లీకి తరలించేందుకు అంగీకరించింది.
ఇలా ఒక్క రోజు కాదు ఏకంగా నెల రోజుల పాటు తల్లి పాలు బిడ్డకు చేరేందుకు ఆకాశమార్గమే దిక్కయింది. అయితే లేహ్ ఢిల్లీ మధ్య ధూరం వెయ్యి కిలోమీటర్లు ఉంటుంది. అయినప్పటికీ విమానయాన సంస్థ అధికారులు ఒక్క రూపాయి కూడా వీరి వద్ద నుంచి తీసుకోలేదు. నెలరోజులు గడిచిన తర్వాత ఈ బాబు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆకాశంలో పాలు పార్శిల్ వెళ్లడం పెద్ద విచిత్రమేమీ కాకపోయినా.. తల్లి ఒక చోట ఉండి బిడ్డ మరో చోట ఉండి ఇలా పాలను నెల రోజుల పాటు అందించడం మామూలు విషయం కాదు.