కరోనా విజృంభణ కాస్త తగ్గినట్లే అనిపించినా చాలా ప్రాంతాల్లో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో మళ్లీ ఇతర దేశాలు లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించాయి. ఈ కోవలోకే ఇటలీ దేశం వచ్చింది. అక్కడ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ విధించింది.
ఇటలీలో రెండు రోజుల్లో 20వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మళ్లీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించింది. అందుకే ఇప్పటి నుంచి నవంబర్ 24వ తేదీ వరకు లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి గియుసేప్ కొంటే ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఆంక్షలను అమలులోకి తెచ్చారు. జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, సినిమాథియేటర్లు అన్నీ మూసేయాలని ఆదేశించారు. ఇంట్లోనే వ్యాయామాలు చేయాలన్నారు. యూరప్ లో బ్రిటన్ తర్వాత ఇటలీలోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి.
దేశంలోని ప్రజలంతా కచ్చితంగా మాస్కులు ధరించాలని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని.. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. బార్ అండ్ రెస్టారెంట్లను సాయంత్రం 6 గంటలకు మూసివేయడంతోపాటు అమెరికాతోపాటు ఇతర దేశాల నుంచి పర్యాటకుల రాకను నిషేధించింది. కొత్త నిబంధనల ప్రకారం వివాహాలు, రిసెప్షన్లు, మత లేదా పౌర వేడుకలను నిషేధించారు. జిమ్ కు వెళ్లకుండా ఆరుబయట వ్యాయామం చేయవచ్చని ఇటలీ సర్కారు సూచించింది. నవంబర్ 24వ తేదీ వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతాయన్న ఆందోళన నెలకొంది.