మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నాడు. ఇక తాజాగా రెండు కొత్త కామెడీ షోలు ప్రారంభిస్తున్నట్లు నాగబాబు ప్రకటించారు. జబర్దస్త్ షో నుండి తప్పుకున్న తర్వాత జీ తెలుగు ఛానల్ లో అదిరింది షో లో కనిపించాడు నాగబాబు. ఈ షో యూట్యూబ్ లోవ్యూయర్షిప్ తెచ్చుకుంటున్నప్పటికీ, టిఆర్పి రేటింగ్ లలో మాత్రం జబర్దస్త్ కి దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. అయితే అదిరింది షో ని మరింత జన రంజకంగా తీర్చడానికి నాగబాబు సరి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారేమో అనుకుంటే, ఆ షో నుండి పక్కన పెట్టి మరో రెండు రెండు కొత్త కామెడీ షోలను ప్రారంభించనున్నట్టు ప్రకటించారు నాగబాబు. అవి తన యూట్యూబ్ ఛానల్ లో ప్రసారమవుతాయని, నవ్వించగల టాలెంట్ ఉన్న వారు తనను సంప్రదించవచ్చని నాగబాబు ప్రకటించారు.
అదేవిధంగా యూట్యూబ్ లో తన ఛానల్ కు మూడు లక్షలు పైగా ప్రేక్షకులు సబ్స్క్రయిబ్ చేసుకున్నారని కూడా నాగబాబు ప్రకటించారు. అయితే ఇది జనసైనికులకు మింగుడుపడటం లేదు. ఈ కామెడీ షో లు పక్కనపెట్టి రాజకీయాలపై, సొంత మీడియా ఏర్పాటుపై దృష్టి సారించాలని అభిమానుల సూచనలు ఇస్తున్నట్టు సమాచారం. జనసేన పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన ప్రతికూలత మీడియా మద్దతు లేకపోవడం. ఇటువంటి ప్రతికూలతలను అధిగమించడానికి సొంత మీడియా ఛానల్స్ , సొంత పత్రిక వంటివి ఏర్పాటు చేసుకోవడం, లేదంటే ఉన్న మీడియా ని సరైన రీతిలో వినియోగించుకునేలా చేసుకోవడం లాంటివి చేయాలని జనసైనికులు బలంగా కోరుకుంటున్నారు.