ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చినా ప్రజలకు అందించేందుకు భారత్లో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అయితే వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుందనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. ఎందుకంటే అత్యధిక జనాభా కలిగిన ఇండియాలో అందరికీ వ్యాక్సిన్ అందించడం భారీ ఖర్చుతో కూడున్న విషయం.
సీరం ఇన్స్టిట్యూట్.. టీకాల తయారీలో దశాబ్దాల అనుభవం ఉన్న సంస్థ. అంతేకాదు.. ఉత్పత్తి సామార్థ్యం పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద టీకా తయారీదారు కూడా. అందుకే.. అధిక జనాభా కలిగిన భారత్ అవసరాలు తీర్చేందుకు సీరం అనువైనది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో.. దేశ అవసరాలకు సరిపడా టీకా ఉత్పత్తి చేసేందుకు కేంద్రం కూడా సీరం పైనే ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కరోనా టీకాను కేవలం రూ. 250కే అందిస్తామంటూ సీరం ఇన్స్టిట్యూట్ కేంద్రానికి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.
ఆక్సఫర్డ్ టీకా ధర రూ. 1000 వరకూ ఉండొచ్చంటూ సీరం సీఈఓ ఆధార్ పూనావాలా గతంలో ప్రకటించారు. అయితే.. టీకాల కోసం ప్రభుత్వాలు భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో టీకా ధరలు దిగివచ్చే అవకాశం ఉందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సీరం మాత్రం ఇప్పటివరకూ ఈ వార్తలపై స్పందించలేదు. టీకా పంపిణీ విషయంలో తొలి ప్రాధాన్యం భారత్కే అని సీరం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అత్యవసర వినియోగానికి అనుమతివ్వాలంటూ సీరం ఇటీవలే ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.