సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ఉత్కంఠ వీడింది. మరి కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీ ప్రకటిస్తానని చెప్పేశారు. దీంతో అక్కడి రాజకీయాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఆయన పార్టీలో ఎవరు చేరుతారు.. ఎంత మేరకు ప్రజలను ఆయన ప్రభావితం చేస్తారన్న దానిపై అంచనాలు వేసుకుంటున్నారు.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేస్తామని రజినీకాంత్ రాజకీయ సలహాదారు తమిళరువి మణియన్ అన్నారు. రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించిన రజినీకాంత్.. చాలా కాలం తర్వాత ఈ మధ్యే పార్టీ గురించి స్పష్టమైన ప్రస్తావన చేశారు. అయితే ఈ ఎన్నికల్లో రజినీ పార్టీ ఎవరితో జట్టు కట్టనుందనే విషయం రాజకీయంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. దీనికి తాజాగా రజినీకాంత్ రాజకీయ సలహాదారు స్పష్టతనిచ్చారు.
‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేము 234 స్థానాల్లో పోటీ చేయబోతున్నాం. మా రాజకీయాలు ఆధ్యాత్మికమైనవి. అయితే ఇందులో ధ్వేషానికి తావు లేవు. మేము ఎవరికీ తిట్టం, ఎవరినీ కొట్టం. ప్రస్తుతం ఇలాంటి రాజకీయాలను మేము అవలంబించబోతున్నాం’’ అని తమిళరువి మణియన్ అన్నారు. ఇక రజినీ రాజకీయ పార్టీపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల రజినీ తన అభిమాన సంఘాల నాయకులతో చెన్నైలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే రజనీకాంత్ పార్టీపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2021 కల్లా తన రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారని ఆయన అంతేవాసులు పేర్కొన్నారు. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంతే ముందుకు రాబోతున్నారని పేర్కొన్నారు.