దేశ వ్యాప్తంగా ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూసిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో మహాఘట్ బంధన్ గెలుస్తుందని ఊరించిన సర్వేలు నిరాశ పరిచాయి. ఇక మహాఘట్ బంధన్లో ఓటమికి తప్పు మొత్తం కాంగ్రెస్పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్జేడీ సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రారంభించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు ఏమాత్రం సరిగ్గా లేదని అంటున్నారు. ఆర్జేడీ సీనియర్ నేత శివానంద తివారీ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మనస్ఫూర్తిగా ప్రచారంలో పాల్గొనలేదని, ఓ పిక్నిక్ స్పాట్కు వచ్చినట్టు వచ్చి వెళ్లారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. 70 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టిందని.. కనీసం 70 ర్యాలీల్లో కూడా కాంగ్రెస్ పాల్గొనలేదన్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇటు వైపు కూడా తొంగిచూడలేదన్నారు. రాహేల్ గాంధీ కేవలం మూడంటే మూడు రోజులు మాత్రమే ప్రచారానికి వచ్చారని అన్నారు.
ఎన్నికలు గంభీరంగా సాగుతున్న సమయంలో రాహుల్ సిమ్లాలో ఉన్నారన్నారు. ఇక మిత్రపక్షాల కంటే ఎక్కువ సీట్లు తీసుకోవడంలో ఉన్న తాపత్రయమే కానీ విజయం సాధించలేదన్నారు. బీహార్ అంటే తెలియని వారందరినీ కాంగ్రెస్ ప్రచారానికి పంపిందన్నారు. అయితే కాంగ్రెస్ ఇలా ప్రవర్తించడం కేవలం బిహార్లోనే కాదని, ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కూడా ఇలాగే ప్రవర్తిస్తోందని ఆయన మండిపడ్డారు. మొత్తానికి ఈ వ్యాఖ్యలు చూస్తుంటే బీహార్ ఎన్నికల ఓటమిని కాంగ్రెస్ పార్టీపైనే వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.