ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారన్నారు. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ఇచ్చిన 33 వాగ్డానాలలో వేటినీ నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివన్నారు.
నంద్యాల ఉప ఎన్నికకు చంద్రబాబు ఎందుకింత ప్రాధాన్యమిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధంగా నంద్యాల ఉప ఎన్నిక జరుగుతోందని, అక్రమాలు, అరాచకాలతో ఉప ఎన్నికలో గెలవాలని టీడీపీ భావిస్తోందని బొత్స ధ్వజమెత్తారు. ఇక్కడి బలహీన వర్గాలను పోలీసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. బాధ్యత గల జిల్లా మంత్రి పోలీసుల చర్యలకు మద్దతు తెలపడం ఏమిటని ప్రశ్నించారు.
టీడీపీ తాటాకు చప్పుళ్లకు నంద్యాల ప్రజలు భయపడరని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ మంత్రుల అవినీతి తారస్థాయికి చేరిందని, అటువంటి మంత్రులు నంద్యాలలో ఓట్లు ఏముఖం పెట్టుకొని అడుగుతారని విమర్శించారు. ప్రజల ఆవేదన, కన్నీళ్లు కనిపించడం లేదా? అని నిలదీశారు.
ప్రభుత్వంలోని పెద్దలంతా అమాయకులు కారని, డబ్బులిచ్చి ఓట్లు కొనేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఓటుకు ఐదువేలు ఇవ్వగలనని చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు కళ్లకు ఓటర్లు భిక్షగాళ్లలా కనిపిస్తున్నారని మండిపడ్డారు. సీఎం చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులా మారాయని, టీడీపీ దుష్టశక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని బొత్స అన్నారు. వైఎస్ఆర్ పాలన తిరిగి తెచ్చేందుకు నంద్యాల ఎన్నిక నాంది కావాలని బొత్స అన్నారు.