కరోనా విలయతాండవం చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. ఇటీవల దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.
కరోనా దేశంలోని ఎంతో మంది ప్రముఖుల ప్రాణాలను తీసుకెళ్లింది. ఈ సెప్టెంబరు నెలలోనే పేరొందిన రాజకీయ నాయకులు, సినీ రంగానికి చెందిన వారు, ప్రముఖులు మృత్యువాత పడ్డారు. ఇప్పుడు ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కరోనాను జయిస్తూనే ఆయన అనారోగ్యం పాలై మృత్యుఒడికి చేరారు. అయితే ఇండస్ట్రీకి చెందిన మరొక వ్యక్తి కూడా కరోనాకు బలయ్యారు. ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ కూడా కరోనాతోనే చనిపోయారు. గత నెలలో కరోనా బారిన పడిన ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతిచెందారు.
ఇక రాజకీయ రంగంలో బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ ఈనెల 17వ తేదీన కన్నుమూశారు. ఈయన కరోనా చికిత్స తీసుకుంటుండగా చనిపోయారు. ఆ తర్వాత ఈ నెల 23వ తేదీన కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి చనిపోయారు. ఈయన కూడా కరోనా సోకగా చికిత్స తీసుకుంటూ చనిపోయారు. బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు రోజుల వ్యవధిలోనే చనిపోవడం ఆ పార్టీకి తీరని లోటని చెప్పొచ్చు. కాగా వీరిద్దరూ కర్నాటక రాష్ట్రానికి చెందిన వారే. ఇక ఏపీలోని తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కూడా కరోనాతోనే చనిపోయారు. ఈయన కూడా కరోనాతో చెన్నైలోని హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ గుండెపోటు రావడంతో చనిపోయారు.
అటామిక్ ఎన్జరీ కమీషన్ మాజీ చైర్మన్ డాక్టర్ శేఖర్ బసు కూడా కరోనాతో మృతిచెందారు. కోల్కత్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కిడ్నీ సమస్యతో బాదపడుతూ చివరకు చనిపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడిక ఎన్ని చర్యలు తీసుకున్నా వ్యాధి విజృంభిస్తూనే ఉంది. మరెంత మంది కరోనాతో ప్రాణాలు విడుస్తారోనన్న భయం అందరిలోనూ ఉంది.