తిరుమల డిక్లరేషన్ విషయంలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ప్రతిపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. సీఎం పర్యటనపై అప్పట్లో లేని అభ్యంతరాలు ఇప్పుడు రావడం ఏమిటని ఆయన అన్నారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం దేనికైనా దిగజారుతారన్నారు. ఇక బీజేపీ నేతలను ఆయన విమర్శించారు. సీఎం జగన్ ఇప్పుడు కొత్తగా తిరుమలకు రావడం లేదని.. ఇప్పటికే చాలా సార్లు వచ్చారని.. అయితే అప్పుడు లేని ప్రశ్నలు ఇప్పుడెందుకొస్తున్నాయన్నారు. ఆనాడు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జగన్ కలిసి వచ్చిన సమయంలో ఈ ప్రశ్నలు ఎందుకు వెయ్యలేదని ఆయన ప్రశ్నించారు.
సీఎంగా జగన్కు డిక్లరేషన్ అవసరం లేదన్నది తన భావన అని చెప్పారు. అయితే అంతర్వేది, నిడమానూరు ఘటనల్లో ప్రభుత్వం విచారణ చేస్తోందన్నారు. అంతర్వేదిని ఇప్పటికే సీబీఐకి అప్పగించినట్లుచెప్పారు. ఇక కావాలనే మారుమూల ప్రాంతాలను ఎంపిక చేసుకొని కొందరు దేవాలయలపై దాడులు చేస్తున్నారని మంత్రి అన్నారు. దీనిపై విచారణ చేసి బాధ్యులను పట్టుకుంటామని తెలిపారు.
కాగా స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ హిందూ దేవాలయల గురించి మాట్లాడేటపుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. దేవాదాయ శాఖ మంత్రికి వేరే శాఖను అప్పగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.