ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్బంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుమల పర్యటనకు వస్తున్న జగన్ను అడ్డుకోవాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. పలువురిని గృహ నిర్బంధం చేస్తున్నారు.
హిందూ ఆలయాలపై దాడులు, తిరుమల డిక్లరేషన్ అంశంపై ఇటీవల రాష్ట్రంలో మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. తిరుమల ఆలయం సాంప్రదాయాలను జగన్ కచ్చితంగా పాటించాల్సిందేనని టిడిపి డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకు అడ్డుతగులుతారన్న ఉద్దేశంతో టిడిపి నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానితో పాటు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తదితర నేతలను ఉదయం నుంచే గృహ నిర్బంధం చేశారు.
తిరుపతిలోని పరిపాలనా భవనం సమీపంలోని వరదరాజస్వామి ఆలయం వద్ద టిడిపి నేతలు ఆందోళన చేశారు. జగన్ కచ్చితంగా డిక్లరేషన్పై సంతకం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలాం శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చినప్పుడు సంతకం చేశారని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని టిడిపి చెబుతోంది. కాగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల అంశాన్ని వైసీపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అంతర్వేది ఆలయంలో రథం దగ్దమైన ఘటనలో ఇప్పటికే సీఎం జగన్ సీబీఐతో విచారణ చేపిస్తామని చెప్పారు.