తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం నలుమూలలా ఆయనకు భక్తులు ఉన్నారు. అయితే అందరూ ఆయన్ను స్వయంగా దర్శించుకోవడం చాలా అరుదు. ఎందుకంటే ఇతర దేశాల్లో ఉన్న వారు ఏడాదికి ఒకసారి కూడా దర్శించుకునే భాగ్యం లేదు. అయితే ఇదే సమయంలో తెలుగు వాళ్లకయితే కాస్త ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు టిటిడి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఇంగ్లీషు, హిందీ భాషల్లో శ్రీవారి కార్యక్రమాలన్నీ ప్రసారం కానున్నట్లు దేవస్థానం ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనే ఎస్వీబీసీ చానల్ ద్వారా శ్రీవారి కైంకర్యాలు, కళ్యాణం, బ్రహ్మోత్సవాలు, తదితర కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. అయితే ఈ విషయంలో స్వామివారికున్న ఉత్తర భారతదేశ భక్తులతో పాటు ప్రపంచ దేశాల వాళ్లు కూడా నిరాశతోనే ఉన్నారు.
తిరుమలను స్వయంగా వచ్చి దర్శనం చేసుకోలేకపోయినా కనీసం టీవీల్లో అయినా ఆ సేవలు చూద్దామనుకుంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చిపడిందని ఎన్నోసార్లు భక్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇన్ని రోజులకు భక్తుల ఆశలు నెరవేరుస్తూ టిటిడి శ్రీవారి సేవలు ఎస్వీబీసీ చానల్ ద్వారా ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రసారం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఉత్తర భారత దేశంలోని ప్రజలు ప్రధానంగా హిందీ మాట్లాడతారు. ప్రస్తుతం టిటిడి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడనుంది. ఇప్పటికే దాదాపు ఆరున్నర కోట్ల మంది ప్రజలు ఎస్వీబీసీ చానల్ను వీక్షిస్తున్నారు.