ఆ రెండు జోన్‌లలో సెలూన్స్, పార్లర్స్‌కి అనుమతి

నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. ఇదే సమయంలో ఆర్దిక కార్యకలాపాలను ప్రారంభించేందుకు మినహాయింపులు ఇచ్చింది. గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్‌లుగా విభజించి ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. మాల్స్, సినిమా థియేటర్లు, స్పోర్ట్స్, ఆధాత్మిక ప్రదేశాల్లో కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. తాజాగా, గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్ల పరిధిలో ఉన్న సెలూన్‌లు తెరవడానికి కేంద్ర హోం శాఖ అనుమతించింది. మే 4 నుంచి మొదలయ్యే మూడో దశ లాక్‌డౌన్‌లో ఇచ్చిన కొన్ని సడలింపులపై శనివారం స్పష్టతనిచ్చింది. నిత్యావసరాలు కానివాటిని కూడా ఆ రెండు జోన్లలో ఈ-కామర్స్‌ సంస్థలు విక్రయించుకోవచ్చని తెలిపింది.

రెడ్‌జోన్లలో మాత్రం ఈ-కామర్స్‌ సంస్థలు కేవలం నిత్యావసర వస్తువుల్ని విక్రయించాలని స్పష్టం చేసింది. రెడ్‌జోన్‌లలో ఇళ్లలో పనిచేసేవారి విషయంలో స్థానిక నివాసుల సంక్షేమ సంఘాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాలు మినహా అన్ని జోన్లలో మద్యం విక్రయాలను కొన్ని షరతులతో అనుమతులు మంజూరు చేసింది. ఇవన్నీ సోమవారం నుంచి అమల్లోకి వస్తాయి. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై, మెట్రో, విమాన, రైల్వే సర్వీసులపై నిషేధం, విద్యా సంస్థలు మూసివేత కొనసాగుతుంది.

మొత్తం 733 జిల్లాల పరిస్థితిని అంచనా వేసిన కేంద్రం.. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. అందులో 130 జిల్లాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో కఠిన నిబంధనలను అమల్లో ఉంటాయి. మిగతా చోట్ల పాక్షికంగా వెసులుబాటు కల్పించారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తెలంగాణలోని 6 జిల్లాలు, ఏపీలోని 5 జిల్లాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here