వలస కూలీల కోసం నేటి నుంచి ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి.. కేంద్ర మంత్రి

లాక్‌డౌన్ కారణంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లొచ్చని ప్రకటించిన కేంద్రం.. వారి తరలింపు బాధ్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులను బట్టి లక్షలాది మందిని ప్రత్యేక బస్సుల ద్వారా తరలించడం కష్టం కాబట్టి.. వారి కోసం ప్రత్యేక రైళ్లను నడపడానికి సంసిద్ధమైంది. వలస కూలీలను తరలించడానికి శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఫోన్‌చేసిన ఆయన.. ఆయా రాష్ట్రాలకు వలస కూలీలను రైళ్లలో తరలిస్తామని చెప్పారు.

ఇదే విషయాన్ని మంత్రి తలసాని సైతం తెలియజేశారు. తనకు ఫోన్‌చేసిన కేంద్ర మంత్రి.. వలస కూలీల తరలింపునకు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించినట్టు తెలియజేశారని వివరించారు. వలస కూలీల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని తాము కేంద్రాన్ని కోరామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కూలీలను తరలించాలని కేంద్రాన్ని రాష్ట్రాలు కోరడంతో ఈ విషయమై మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. 15 లక్షల మందిని బస్సుల్లో తరలించడం సాధ్యం కాదు కాబట్టి.. ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇదే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన రైల్వే శాఖ.. ప్రత్యేక రైళ్లను నడపడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మే 3 వరకు రైళ్లను నిలిపేసిన సంగతి తెలిసిందే.

వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలతోపాటు విద్యార్థులు, పర్యాటకులు, తీర్థయాత్రలకు వెళ్లిన వారు సొంత రాష్ట్రాలకు వెళ్లే అవకాశం కల్పిస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని.. స్వస్థలాలకు వెళ్లిన తర్వాత వారిని హోం క్వారంటైన్లో ఉంచాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇందుకోసం నోడల్ అధికారులను నియమించాలని రాష్ట్రాలకు సూచించగా.. ఇప్పటికే పలు రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయి.

మరోవైపు, పలు రాష్ట్రాలు తమవారి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. గుజరాత్‌లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను తొలివిడతగా 700 మంది శుక్రవారం స్వరాష్ట్రానికి చేరుకున్నారు. అలాగే, అనంతపురంలో చిక్కుకుపోయిన రాజస్థాన్ వాసులు 1,300 మంది ప్రత్యేక బస్సుల్లో శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. అలాగే, రెండు రోజుల కిందట తమను స్వస్థలాలకు పంపాలని హైదరాబాద్ ఐఐటీలో ఆందోళనకు దిగిన కార్మికులను ప్రత్యేక బస్సుల్లో లింగపల్లికి తరలించిన అధికారులు.. అక్కడ నుంచి వారిని రైళ్లలో సొంతూళ్లకు పంపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here