లాక్‌డౌన్‌ను పొడిగించడానికే మెజార్టీ సీఎంల మద్దతు.. మోదీ ముందు ఆ డిమాండ్లు

కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్రం విధించిన మే 3వ తేదీతో ముగియనుండగా.. హాట్‌స్పాట్‌లలో మాత్రం లాక్‌డౌన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంలకు తెలిపారని సమాచారం. రాష్ట్రాల్లోని పరిస్థితుల ఆధారంగా ఆంక్షలు సడలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు లేని జిల్లాల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎంలకు ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.

ఆర్థిక కార్యకలాపాలు ఆగొద్దన్న హోం మంత్రి అమిత్ షా.. సోషల్ డిస్టెన్సింగ్, ఫేస్ మాస్కులు మన దైనందన జీవితంలో భాగం కావాలన్నారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటిని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. సూక్ష్మ, మధ్య తరహా సంస్థలను తెరవాలన్న డిమాండ్ వినిపిస్తోన్న వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది.

వలస కూలీలను సొంతూళ్లకు తీసుకెళ్లడానికి ఓ విధానాన్ని రూపొందించాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ప్రధాని మోదీని కోరారు. రాజస్థాన్‌లోని కోట నుంచి యూపీకి చెందిన విద్యార్థులను యోగి సర్కారు వెనక్కి తీసుకొచ్చింది. కానీ కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం తాము బిహార్‌కు చెందిన విద్యార్థులను వెనక్కి తీసుకురాలేదని.. మిగతా రాష్ట్రాలు ఎలా తీసుకొచ్చాయని నితీశ్ కేంద్రాన్ని ప్రశ్నించారు.

లాక్‌డౌన్‌ను మరో నెలపాటు పొడిగించాలని ఒడిశా కేంద్రాన్ని కోరింది. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వారిలో మెజార్టీ సీఎంలు లాక్‌డౌన్ పొడిగించాలని కోరారని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి తెలిపారు. 2008లో యూపీఏ సర్కారు ప్రకటించిన తరహాలోనే ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలని సీఎంలు డిమాండ్ చేశారని పుదుచ్చేరి సీఎం చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here