చెన్నైలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లకు కరోనా పాజిటివ్

తమిళనాడులో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 716 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఒక్క చెన్నైలోనే 500 కేసులు రాగా.. తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,718కి చేరింది. మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా మరణాలు 61కి చేరాయి. ఒక్క చెన్నై నగరంలోనే 4,888 మంది వైరస్ బారినపడ్డారు. ముంబయి మాదిరిగానే రోజుకు వందల్లోనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కరోనా సోకింది.

మహమ్మారి తమిళనాడులో వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత పది రోజుల్లోనే కేసులు మూడింతలయ్యాయి. వీటిలో అత్యధికంగా చెన్నైలోనే వెలుగుచూస్తున్నాయి. ఇక, కోయంబేడు మార్కెట్ ప్రభావం చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, అరియలూరు జిల్లాల్లో సైతం కనిపిస్తోంది. చెన్నై తర్వాత అత్యధిక కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. చెన్నైలో 4,882, తిరువళ్లూరులో 467, కడలూరులో 396, చెంగల్పట్టులో 391, అరియలూరులో 344, విళుపురంలో 299 కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, ఉన్నతాధికారులు కూడా వైరస్ బారినపడుతున్నారు. చెన్నైలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు మహమ్మారి వైరస్ బారినపడ్డారు. వీరిలో ఓ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ఉన్నారు. ఈయన ఇటీవల కోయంబేడు మార్కెట్‌లోని సీడీఎంఏ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఆయనకు వైరస్ సోకింది. డీసీపీ, ఏసీపీస్థాయి అధికారులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కోవిడ్ బారినపడిన మొత్తం పోలీసుల సంఖ్య 190కి పెరిగింది.

అలాగే, చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ హెల్త్ ఇన్‌స్పెక్టర్ కూడా కరోనా బారినపడ్డారు. చెన్నై నగరంలో కేసులు పెరిగిపోతుండటంతో క్వారంటైన్ సమయాన్ని తగ్గించాలని ప్రజారోగ్య విభాగం అధికారులు భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం.. వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారికి క్వారంటైన్ 28 రోజులను 14 రోజులకు తగ్గించాలని నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here