కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. కల్నల్, మేజర్ సహా ఐదుగురు జవాన్లు మృతి

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతాలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఓ కల్నల్, మేజర్, ఇద్దరు జవాన్లు, ఓ సబ్‌-ఇన్‌స్పెక్టర్ ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. కుప్వారా జిల్లాలోని చంజ్‌ముల్లా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందడంతో సైన్యం అక్కడకు చేరుకుంది. కొంత మంది పౌరులను ఉగ్రవాదులు బందీలుగా చేసుకోవడంతో వారిని రక్షించడానికి ఆర్మీ అధికారులు బృందం ఆపరేషన్ నిర్వహించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో కశ్మీర్ మాడ్యూల్ అల్‌ఖైదా చీఫ్ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎదురు కాల్పుల్లో ఆర్మీ మేజర్ సహా ఆరుగురు సైనికులు, మరో ఇద్దరు పౌరులు గాయపడగా.. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఎరివేత చర్యను సైన్యం మరింత ముమ్మరం చేసింది. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి పెద్ద సంఖ్యలో ముష్కరులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో ఆర్మీ అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా ఉగ్రకదలికలపై నిఘా పెంచి, ముష్కరుల ఏరివేతకు ఆపరేషన్లు చేపట్టింది. ఎల్ఓసీ వెంబడి పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తూ ఉగ్రవాదులను దేశంలోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here