కరోనాపై కేంద్రం గుడ్ న్యూస్.. రికవరీ రేటు 25 శాతం, రెట్టింపు కావడానికి 11 రోజులు

విషయమై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. కేసులు రెట్టింపు కావడానికి పట్టే సమయం 11 రోజులకు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి లవ్ అగర్వాల్ తెలిపారు. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగిందని తెలిపింది. రెండు వారాల క్రితం మన దేశంలో కోవిడ్ పేషెంట్ల రికవరీ రేటు 13.06 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 25.19 శాతానికి చేరిందని లవ్ అగర్వాల్ తెలిపారు.

గత 24 గంటల్లో దేశంలో 1718 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,050కి చేరింది. దేశంలో కరోనా మరణాల రేటు 3.2 శాతం ఉందని కేంద్రం తెలిపింది. కాగా 78 శాతం కోవిడ్ మరణాలకు ఇతర వ్యాధులు కూడా కారణమని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటి వరకూ 8324 మంది కరోనా నుంచి కోలుకోగా.. గత 24 గంటల్లో 630 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

లారీ డ్రైవర్లకు స్క్రీనింగ్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించినట్లు కేంద్రం తెలిపింది. కరోనాపై పోరాటం కలిసి రావాలని రాష్ట్రాలకు కేంద్రం పిలుపునిచ్చింది. తెలంగాణలో సరిపడా టెస్టింగ్ కిట్లు, పీపీఈలు ఉన్నాయని హైదరాబాద్‌లో పర్యటించిన కేంద్ర బృందం తెలిపింది. కోవిడ్ పేషెంట్ల టెస్టింగ్ నుంచి డిశ్చార్జ్ వరకు రాష్ట్రం ఎండ్ టు ఎండ్ ఐటీ డ్యాష్‌బోర్డ్ ఉపయోగిస్తోందని కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్య సలీల శ్రీవాస్తవ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here